Search This Blog

Wednesday, September 28, 2011

ప్రజా క్షేమమే ముఖ్యం కావాలి


ఒకప్పుడు మన దేశంలో మద్య నిషేధం అమలులో ఉండేది. మద్య నిషేధం వల్ల ఖజానాకి గండి పడిపోయి ప్రభుత్వం దివాలా తీస్తుంది. సంక్షేమ పథకాలని కొనసాగించడానికి డబ్బు ఉండదు అంటూ చాలా చోట్ల మద్య నిషేధం ఎత్తేసారు.
రాష్ట్ర ప్రభుత్వం వేలం పాటలు పాడి లిక్కర్ షాపులకి అనుమతి ఎచ్చింది. అన్ని ఊళ్ళలో మందు బాబులు, ప్రభుత్వం అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ ఖజానా నిండుగా ఉంది. మందు బాబులు పీకల దాకా తాగి వీధుల్లో భరత నాట్యం, ఇంట్లో కలహ నాట్యం చేస్తున్నారు.
'లిక్కర్ షాపులని కొన్ని నిబంధనలకి కట్టుబడి నడపాలి.లైసెన్సులు ఇచ్చే ముందుకండీషన్లు జారీ చేసాము. నిబంధనలని ఉల్లంఘిస్తే షాపులు మూయించి, లైసెన్సులు రద్దు చేస్తామూ అంటూ శాసన సభల్లో గొంతు చించుకు అరుస్తుంటారు మన రాజకీయవాదులు. కాని వాస్తవానికి తాము విధించిన నిబంధనలని ఎంత వరకు లిక్కర్ షాపులు అమలు చేస్తున్నాయి అన్నది పరిశీలించక ఆ బాధ్యత మధ్యవర్తులకి వదిలేస్తున్నారు. 
స్కూళ్ళు,కాలేజీలు,కుటుంబాలు నివసించే ప్రాంతాలు,  మసీదులు, చర్చిలు, గుళ్ళు  గోపురాలు, భజన మందిరాలు, మఠాలు- వీటి చుట్టు పక్క్ల లిక్కర్ షాపులు ఉండకూడదు. రెండు కిలోమీటర్ల దూరాన ఉండాలి తప్ప సామాన్య ప్రజలకి- స్త్రీలు, పిల్లలకు ఇబ్బంది కలిగేటట్లు ఉంచకూడదు. అర్ధరాత్రి దాక వీటిని తెరిచి ఉంచకూడదు అని కూడా నిబంధన ఉంది.
ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి. ఎవరూ కాదనరు. అందుకని లిక్కర్ షాపులు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నప్పుడు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఈ షాపులు ఎక్కడ, ఎలా నడుపుతున్నారో నిఘా వేసి ఇరవై నాలుగు గంటలూ ప్రభుత్వం, పోలీసులూ ఒక కన్నేసి ఉంచాలి. ఇటువంటి షాపులను మూయించటమే కాదు, ఆ షాపు వాళ్ళ లైసెన్సు రద్దు చేసి కటకటాల వెనక కూర్చోబెట్టాలి.
ప్రభుత్వం డబ్బు దండుకోవడంలో చూపే చొరవ, ప్రజల క్షేమం పట్ల కూడా చూపించాలి. ప్రజా క్షేమమే ముఖ్యం కావాలి. ___  మాలతీ చందూర్.   

No comments:

Post a Comment

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !