Search This Blog

Showing posts with label నా అభిప్రాయాలు. Show all posts
Showing posts with label నా అభిప్రాయాలు. Show all posts

Sunday, October 20, 2013

"యువరాజ"కీయం

"స్వామీ!"

"ఏమీ!"

"యువరాజా వారు తమ దర్శనం కోరుతున్నారు"

"అని నీవు సందేశం తీసుకు వచ్చావా మూర్ఖ శిష్యా? పొమ్ము.. తక్షణమే తోడ్కొని రమ్ము"
(వీడి దుంప తెగ! వచ్చిన వాడిని వెంట తీసుకురాకుండా మళ్ళీ నాకు కబురొకటి. వాడి మూడ్ ఎలా ఉందో, వెయిట్ చేయించినందుకు నా గతి ఏమిటో, హతవిధీ!)

"భక్తులారా! ఈ రోజుకిక సత్సంగం సమాప్తం. స్వామీజీ వారి కాంత సేవకు సారీ ఏకాంత సేవకు వేళ ఐనది"

" బాబా అల్లకల్లోల స్వామీజీకి జై..
బాబా అల్లకల్లోల స్వామీజీకి జై.."

" హా! వీళ్ళ పిలుపు మండిపోనూ! అల్లకల్లోల ఏమిట్రా మూర్ఖ శిష్యా?"

"క్షమించాలి స్వామీ! అలక్ లాల్ స్వామీ అనే అంటున్నారు స్వామీ! మీకలా వినిపిస్తున్నట్టోంది" 

" స్వామీ! యువరాజా వారు వేంచేస్తున్నారు"

" స్వామీ మీరు లేచి వెళ్ళి స్వాగతం పలకడం ఏమిటి స్వామీ?"

" నోరు ముయ్యరా అర్భకా! యువరాజు వింటాడు" 

" చిత్తం స్వామీ!"

" మా ఆశ్రమం పావనం అయ్యింది యువరాజా! కబురు చేస్తే మేమే..."

" ప్రణామములు స్వామీజీ"

" సకల సంపదా ప్రాప్తిరస్తు" 

" యువరాజా వారెందుకో చింతిత మనస్కులై ఉన్నట్టున్నారు!"

" చింత కాకుంటే మరేముంటుంది స్వామీ? రాజమాత ఆరోగ్యమా అంతంత మాత్రంగా ఉంటోంది. నలభై దాటిపోయినా నేనింకా యువరాజులాగే ఉన్నాను.యువరాజు, యువరాజు అని అనడమే గానీ నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది స్వామీ"

(హమ్మయ్యా! బయట నిలబెట్టినందుకు నేను స్వామిని కాకుండా పోతానేమో అనుకున్నాను. ముందరి కాళ్ళకు బంధం వేయడం మంచిదైంది.ఐనా పెళ్ళి ఒక్కటే చేస్కోలేదు కానీ నువ్వేమన్నా తక్కువ ఎంజాయ్ చేస్తున్నావా నాయనా?)
" అదేమిటి నాయనా! ఇప్పుడు నీ మనశ్శాంతికి వచ్చిన ఆపదేమిటి?"

" ఏం చెప్పమనటారు? ఐనా మీకు తెలియనివి ఏమున్నాయి చెప్పండి? ఆలోచించకో, చించో రాజమాత ముందు అన్నీ చేసేస్తుంది.తర్వాత నన్ను చంపుతుంది. మొన్నటికి మొన్న అవినీతి పరులైనా, రౌడీలైనా, దగాకోరులైనా, ఖూనీకోరులైనా ప్రతీ అడ్డమైనవాడికీ రాజ సభలో చోటు ఉంటుంది అని చట్టం తీసుకొచ్చి నా నెత్తికి చుట్టారు. ఇక నా జోక్యం తప్పలేదు.ఇది మొన్న జరిగిందే., అంతకుముందు ఇలాంటివి ఎన్ని జరగలేదు, ఎన్ని సర్దిపుచ్చలేదు చెప్పండి. ఐనా నేనెన్ని హీరో వేషాలేసినా  జనాల దృష్టిలో మన విలనిజం పోవట్లేదు లెండి...అది వేరే విషయం. సరే ఈ రాజ తంత్రాలన్నీ ఒక ఎత్తు. అరే నేనెప్పటి నుంచో పెళ్ళి చేయండి మొర్రో అని మొత్తుకుంటుంటే నన్ను కానట్టే ఉంటుంది మా అమ్మ. అసలు ఆవిడ ఉద్దేశ్యం ఏమిటో చెప్తే నేను ఇంక ఆ సంగతి ఏమీ అడక్కుండా వేరే దారులేమన్నాచూస్కుంటా కద స్వామీ! ఆ మాత్రం సెన్స్ కూడా లేదా?"

( ఇండైరెక్టుగా ఇప్పుడేమీ లేవని చెప్తున్నావా నాయనా నాకు? పిట్ట కథలు ఇంకెన్ని వినాల్సి వస్తుందో కానీయ్!)
" అవును నాయనా! అవును" 

" అంతేనా స్వామీ! ఇప్పుడు ఈవిడ సృష్టించిన సమస్యలు చూస్తే ఉండగా ఉండగా నా గతి ఏమఒతుందా అని భయంగా ఉంది స్వామీ! రాజ్యంలో ఎక్కడ చూసినా మా మీద కినుక వహించని ప్రజలు లేరంటే నమ్మండి. అసలు మా అమ్మ సిద్ధాంతం చెప్పమంటారా? విభజించి పాలించమంటుంది, మనకి ఎదురు చెప్పని వాళ్ళే అధికార పీఠంలో ఉండాలంటుంది, మన మీద ఎంత బురద ఉన్నా దున్నపోతులా దులిపేసుకోవాలంటుంది. పక్కోడు ఎంత మేధావైనా ఆడ్ని తొక్కేసి, నొక్కేసి అది మనం ఉపయోగించుకోవాలంటుంది. అసలు ఇదంతా మా రాజ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అంటుంది. ఇదంతా తప్పని నేను అనడం లేదు స్వామీ! కానీ..."

"(వార్నీ! ఇదంతా తప్పు కాదా? మరెందుకు నాయనా ఈ గోడు)"  

" కానీ.. ఇదంతా చేయడానికి ఖర్చు కూడా భారీగానే ఉంటుంది కదా!మీరే చెప్పండి స్వామీ! వాళ్ళేమన్నా వెర్రోళ్ళా? జనాల దగ్గర ఊరికే విలన్లు ఐపోవడానికి?"

( ఇంతకీ ఈయన గారి అంతరార్ధం ఏమిటి చెప్మా?)
అవును నాయనా! నిజమే కానీ మీ అంతరార్ధం ఏమిటో..."

" అదే స్వామీ చెప్తున్నాను. ఖజానా చూస్తే అంతంత మాత్రంగా ఉంది.మేం దోచుకున్నది ఖర్చు పెడదామంటే, ఆ తర్వాత్తర్వాత అడుక్కు తినడానికి కూడా పనికిరాకుండా పోతాం. అందుకని..."

(వారి పిడుగా! నన్నే ఇరికిస్తున్నావూ.. నీ దుంప తెగ!)
"ఆ.. అందుకని..ఏమిటో చెప్పండి యువరాజా?"

" ఆ.. ఏముంది స్వామీ! ఈ రోజుల్లో రాజకీయ పార్టీలకి వచ్చే విరాళాల కన్నా, స్వామీజీలకు వచ్చే కలెక్షన్లే ఎక్కువ.."

( అందుకని నాకే ఎసరు పెడతావురా కుంకా!)

" అలా అని మీ సంపద కొల్లగొట్టాలని మా అభిమతం కాదు స్వామీ!"

(మరేమిటిట?)

" పార్టీకి విరాళాలు బాగానే వస్తున్నాయి.. కాదనటం లేదు.కానీ ఎవడన్నా విరాళం ఇస్తే ఊరికే ఇవ్వడు కదా!  నీకది- నాకది పద్ధతి ఇక్కడ.."

( ఒకడిది ఒకడు నాక్కునే పరిస్థితి అని చెప్పరాదూ శుంఠా!)

" మరి మన ప్రజలనే వారు అలా కాదే..వాళ్ళలో మన పరపతి పోకుండా ఉండాలంటే వాళ్ళని కూడా కొనుక్కోవాల్సిందే కదా స్వామీ? "

" వాళ్ళేమన్నా వస్తువులా నాయనా కొనుక్కోవడానికి?"  

" మీరు అలా లాజిక్ తీసారనుకోండి, మేము కూడా తీయాల్సి వస్తుంది. ఈ విభూదిలోనూ, తాయెత్తు లోనూ యెంత మహిమ ఉందో మీకూ తెలుసు, మాకూ తెలుసు.."

(అలా వచ్చావా నాయనా? ఇక నువ్ చెప్పేది వినడం తప్ప నేనేం చేయగలనులే)
" అసలు ముందు నీ మనసులో ఉన్న విషయం చెప్పు నాయనా!"

" అదే స్వామీ! ఎలా మొదలు పెడదామా అని... ఇప్పుడూ.. ఈ విరాళాలూ, కుంభకోణాలూ, దోచుకోవాడాలూ, దాదాగిరీలూ అన్నీ పాత పద్ధతులు ఐపోయాయి స్వామీ! నాకెందుకో మన రాజ్య చరిత్రని ఒకసారి తవ్వి తీస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన్ వచ్చింది స్వామీ!"

( ఏమంటున్నాడబ్బా! నాకంతా అయోమయంగా ఉందేమిటీ? ఇందులో ఏం తిరకాసు పెడుతున్నాడు వీడి దుంపతెగ! మొత్తానికి నన్ను ఇరికించడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు..థూ..నా బతుకు)
" తమరి ఆలోచనలోని అంతరార్ధం నాకు బోధపడలేదు నాయనా!"

" ఇందులో బోధపడ్డానికేముంది స్వామీ! చరిత్రని తవ్వి తీయడమంటే నిధి, నిక్షేపాలని పట్టడం అని.." 


( ఓరి నీ బతుకు బందెల దొడ్డిలో కట్టెయ్యా!ఇదేం ముదనష్ఠపు ఐడియా రా? ఐడియా.. హూ.. నిజంగానే ఇది నా లైఫ్ నే మార్చేసేటట్టుంది. నీ యువరాజాగిరీతో నా స్వామిగిరీకే ఎసరు పెడితివి కదరో నీ... కంట్రోల్.. కంట్రోల్..)

" ఏమిటి స్వామీ! ఆలోచిస్తున్నారు?|"

" అదే నాయనా! ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అని?"

" మీరు ప్రయత్నం, ప్రచారం మొదలుపెట్టండి. దానిని అమలులోకి తెచ్చే బాధ్యత నాది. ఎలా సర్ది చెప్పాలో. ఎలా పక్క దారి పట్టించాలో అదంతా నేను చూసుకుంటా. మీరు మాత్రం మీ కర్తవ్యం నిర్వహించండి. మీ కర్తవ్య నిర్వహణలో తేడాలేమన్నా వస్తే...."

" అమ్మమ్మా! ఎంత మాట నాయనా? ఇక మీరు నిశ్చింతగా ఉండండి. రేపు ఈ పాటికి ఒక ప్రభంజనమే మొదలవుతుంది"

" అప్పుడే మీకు ఆలోచన వచ్చినట్టూంది కదూ స్వామీ?"

" రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేమిటి నాయనా"

" ఐతే మరి మాకిక సెలవా స్వామీ!"

" మంచిది నాయనా! త్వరలోనే నీకు శుభం కలుగుతుంది వెళ్ళిరా నాయనా!"

" ప్రణామములు స్వామీ!"

" పాపీ చిరాయువు!"

" స్వామీ!"

" ఆ.. అదే నాయనా! దీర్ఘాయుష్మాన్ భవ!"  


చరిత్ర ఇక ఇప్పుడు పుస్తకాల్లో మాత్రమే చూడాల్సి ఉంటుందేమో.. సారీ చదవాల్సి వస్తుందేమో.. దర్శనీయ స్థలాలు అనేవి కూడా ఇక దేశ పటంలో కనిపించవు. 
ఈ మాట ఎందుకంటున్నానో ఈ పాటికి మీకు అర్ధమైపోయే ఉంటుంది. ఇలా ఎవరికో కలలు, కాకరకాయలు వచ్చాయని వాటిని స్వయంగా ఆర్కియాలజీ వాళ్ళే దగ్గరుండి తవ్వించడం చూస్తుంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన కల దేశానికింకేం ఉంటుంది.ఈ రోజు ఇక్కడ, రేపు ఇంకొకచోట తవ్వేస్తారు. ఉన్నవే ఏవో కొన్ని మచ్చు తునకలు ఉంటే వాటికి కూడా ఏం దుర్గతి పడుతోందో?

ఉత్తరప్రదేశ్ లోని రాజా రావ్ రాం బక్స్ సింగ్ కోటలో జరుగుతున్న తవ్వకాలకి ఇది నా స్పందన.





 




Tuesday, October 18, 2011

నైపుణ్యం

ఈ విషయం మీద మన పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, 

అమ్మమ్మల కథల్లోనూ చాలా కథలే ఉన్నాయి. మనకందరికీ బాగా నచ్చిన ఒక కథ కుందేలు-తాబేలు పందెం కథ. ఆ కథ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఆ కథని మళ్ళీ క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత అసలు ఎందుకు ఇది రాస్తున్నాను అన్న సంగతి చెప్తాను.
కథ చూద్దాం., కుందేలుకి తన కంటే వేగంగా పరుగెత్తే వాళ్ళెవ్వరూ లేరని కొంచెం గర్వంగా ఉంటుంది. అది తన సత్తా చాటుకోవడానికి ఎవరూ దొరకలేదన్నట్టు తాబేలు దగ్గరకెళ్ళి , నాతో పరుగెత్తగలవా అని పందెం వేస్తుంది. తాబేలు ఆలోచిస్తుంది, నేను వేగంగా పరుగెత్తలేనని కుందేలుకు తెలుసు,ఇనా సరే నా దగ్గరికొచ్చి నన్ను ఆట పట్టిస్తోంది. తప్పనిసరిగా దీనికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని పందేనికి సరే అంటుంది. ఇక పందెం మొదలవుతుంది. కుందేలు కొంత దూరం పరుగెత్తి, వెనక్కి చూస్తే తాబేలు దరిదాపుల్లో ఎక్కడా కనిపించదు. సరే ఎలాగూ నేనే గెలుస్తాను కదా కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని అలా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి కాస్తా గాఢ నిద్రలోకి మారిపోతుంది. ఈ లోపులో తాబేలు గమ్యం చేరుకుని పందెం గెలుస్తుంది. మెలకువ వచ్చి గమ్యం చేరుకున్న కుందేలుకి గర్వభంగం అవుతుంది. 





ఇదే తాబేలు తెలివితో ఇంకోలా కూడా చేసింది. ఇది కూడా అదే పందెం కథ కాని వేరేలా ఉంటుంది. పందెం వేసిన రోజు రాత్రి ఆ సంగతిని తాబేలు తన జాతి అంతటికీ చెప్తుంది. అప్పుడు అందులో ఒక వృద్ధ తాబేలు ఒక ఉపాయం చెప్తుంది. దానికి సరే అన్నాయి మిగతా తాబేళ్ళు.  మర్నాడు కుందేలు పందెం ప్రకారం పరుగు మొదలుపెడుతుంది. కానీ ఇక్కడ ఆ కథలోలా విశ్రాంతి తీసుకోదు. పరుగు పెడుతూనే ఉంటుంది. దాన్ని దాటించేసాను అనుకునే లోపులో కుందేలు కంటే ముందు తాబేలు ఉంటుంది. మళ్ళీ దాటించేసాను అనుకునే లోపులో కుందేలు కంటే ముందు తాబేలే ఉంటుంది. ఇలానే కుందేలు గమ్యం చేరకముందే అక్కడ తాబేలు ఉండడంతో కుందేలు ఖంగుతింటుంది. ఇక్కడ కూడా కుందేలుకి గర్వభంగం అయ్యింది. కానీ ఇది ఎలా సాధ్యపడిందంటే ఆ రాత్రి వృద్ధ తాబేలు ఇచ్చిన ఉపాయం అది. దాని ప్రకారం ఆ రాత్రే అవి రెండు మీటర్ల దూరంలో ఒక్కొక్క తాబేలు చొప్పున గమ్యం వరకు ఉండి ఉపాయాన్ని అమలుపరిచాయి. 
ఇక ఈ కథలో మనకు తెలిసేదేమిటి అంటే ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. అదే సమయంలో మనం ఏమిటో అన్నది కూడా తెలుసుకోవాలి. ఎవరి గొప్పతనం వారిదే. ఒకరు బుద్ధితో చేస్తే, ఇంకొకరు బలంతో చేస్తారు. ఇవేవీ లేకుంటే తమ తెలివి తక్కువతనంతో కూడా విజయం సాధించినవారు ఎందరో ఉన్నారు.
        ఇక ఈ కథ మీకెందుకు చెప్పానో చెప్తాను. ఎందరో బ్లాగర్లు..అందరికీ వందనాలు. ఇది నా మనసులో మాట మాత్రమేనండీ. పంచుకోవాలని అనిపించి ఇలా వ్రాస్తున్నాను. ఈ బ్లాగు మొదలుపెట్టినప్పటి నుంచీ ఒక విషయంలో బలహీనత ఏర్పడింది. ఇక్కడ ఎంతో మంది రచయితలు, రచయిత్రులు. అందరి కలాల నుంచీ జాలువారిన ఎన్నో ఆణిముత్యాలు. అవన్ని చూసి నేను వీళ్ళ దరికి చేరగలనా? వీళ్ళ గులాబీ రాతల గుబాళింపుల ముందు నేనొక గడ్డి పూవును కూడా కాదే అని ఒక రకమైన భావన.ఇది ఈర్ష్య మాత్రం కాదండీ. ఆరాధనా భావం మాత్రమే. 

ఇదే భావాన్ని నేను ఒక నేస్తంతో పంచుకున్నాను. అప్పుడు తను నన్ను ఒక ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పమనడం, నేను సరే అనడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, " గూడు కట్టే పిట్ట గొప్పదా లేక పుట్ట పెట్టే చీమ గొప్పదా ?"  అని.

 నాకు తను అలా ఎందుకు అడుగుతున్నారో మొదట అర్ధం కాలేదు. ఐనా సరే జవాబు చెప్పాను. "దేని నైపుణ్యం దానిదే. అందులో ఎవరు గొప్ప అంటే ఏం జవాబు చెప్పగలం? ఎవరినీ తక్కువగా అంచనా వేయలేం కదా"  అన్నాను. 
 దానికి తను " సరే మరి తెలిసింది కదా? ఇంకా ఈ బాధెందుకు? ఇక్కడ ఎవరూ ఎవరికీ తక్కువ కారు. ఎవరూ ఎవరికీ సాటి రారు. అటువంటప్పుడు మనం ఇలాంటివన్ని మనసులో పెట్టుకోకూడదు. మనం చేసే పనిని చేస్కుంటూ పోవడమే, ఇంకొకరితో పోల్చుకోవడం అన్నది బుద్ధి లేని వాళ్ళు చేసే పని" అని చెప్పేసరికి నాలో ఉన్న బాధ అర్ధం లేనిదనిపించింది. ఇంత చక్కగా చెప్పి నాలో ఉన్న ఆ భావనని సరి చేసినందుకు ఆ నేస్తానికి, ఈ విషయం అందరితో పంచుకునేలా నన్ను ప్రోత్సహించిన మరో నేస్తానికి బ్లాగోన్ముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్కుంటున్నాను.
అలాగే నాలాగే ఇలా ఎవరైనా ఇదే భావనతో ఉంటే ఆ భావన నుంచి బయటికి రమ్మంటున్నాను. నిర్భయంగా, నిర్మొహమాటంగా మన భావాలని ప్రకటించమంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక విషయం దాగి ఉంటుంది. ఆ విషయాన్ని నలుగురితో పంచుకోవడం ఒక ఆనందం. ఆ ఆనందాన్ని దూరం చేస్కోకూడదని నాకనిపిస్తోంది. మరి మీకు ???                        

Friday, September 16, 2011

భావ వ్యక్తీకరణ

మనందరికీ చాలా రకాలైన హక్కులున్నాయి. అందులో భావాలను వ్యక్తీక్తీకరించడం ఒకటి. తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా, నిర్భయంగా వెల్లడించడం అంటే చాలా ధైర్యం కావాలి. అందుకు సరైన మాటలు కూడా కావాలి. ఇలాంటి భావ వ్యక్తీకరణలో 'విమర్శ ' చాలా ముఖ్యమైనది అని నేననుకుంటాను. విమర్శ చేయడం అన్నది కూడా ఒక కళ. ఎందుకంటే విమర్శలలో కొన్ని స్పూర్తి దాయకం గాను, కొన్ని బాధ పెట్టేవి గాను, కొన్ని సరదాగాను ఇలా పలు రకాలుగా ఉంటాయి.
అసలు ఈ అభిప్రాయాలను వెల్లడించడం అనే అంశాన్ని నేను ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. కొన్ని బ్లాగులలో విమర్శలు లేదా అభిప్రాయాలు చూస్తుంటే.. ఆయా బ్లాగర్లకి అవి ఎలా అనిపిస్తున్నాయో తెలియదు కాని నాకెందుకో బాధగా అనిపించింది. ఎందుకంటే ఆ అభిప్రాయాలు చదవడానికి వీల్లేనంతగా ఉంటున్నాయి కాబట్టి.
మేమెవరో తెలియదులే అని అలా చేస్తున్నారో, ఎలా వ్రాసినా పర్వాలేదని అనుకోవడమో తెలియదు. 
మన అభిప్రాయాలను తెలియపరిచేటపుడు మనల్ని ఏంట్రా బాబూ తింటున్నావ్ అని కాస్త సరదాగా తిడుతూ వ్రాసినా పర్వాలేదు కాని, అంత అసభ్య పద జాలాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదని నా అబిప్రాయం.  
ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళది అని అనుకునే కన్నా సరైన పదజాలం ఉపయోగిస్తే మంచిదేమొ అని అనిపిస్తుంది. చదివేవాళ్ళ మనసుకు కూడ హాయిగా అనిపిస్తుంది.
నేనేమన్నా తప్పుగా వ్రాస్తే బ్లాగర్లు, బ్లాగు చదివేవాళ్ళు మన్నించవలిసిందిగా మనవి. కాని ఒకసారి ఆలోచిస్తే కూడా మంచిదేమో అని నా అభిప్రాయం.