Search This Blog

Showing posts with label చద్దన్నం మూట. Show all posts
Showing posts with label చద్దన్నం మూట. Show all posts

Sunday, February 19, 2012

మందుబాబులు




ఈనాడు వైద్యుడు నేలబారు నుంచి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఆపరేషన్ మొదలుపెట్టేముందు, డాక్టరు ఏ మతానికి చెందినవాడైనా ఆ మత దైవాన్ని ప్రార్థించి మరీ ఆపరేషన్ కత్తి చేపడతాడు. 
అంతటి నియమనిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో తమ వృత్తికి అంకితమయ్యే డాక్టర్లు కొందరు ఈనాడు తాగి ఆపరేషన్ థియేటర్ కి వస్తున్నారంటే మనం ఎక్కడికెళుతున్నాము? వైద్యవృత్తి దైవికము కాదు మందువికము అన్న స్థితికి పడిపోతున్నాము. 


వైద్యుడు రోగి ప్రాణాలు కాపాడతాడు. న్యాయవాది తనని నమ్మి వచ్చిన క్లయింటు ఆస్తిపాస్తులను న్యాయబద్ధంగా కాపాడతాడు. ఈ రెండు వృత్తులూ ప్రాణాలనూ, ఆస్తులనూ కాపాడే వృత్తులు.వైద్యుడు వృత్తి చేపట్టేముందు రోగి ప్రాణాలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యం,ఆశయం, శాయశక్తులా అందుకు పోరాడతానని శపథం చేస్తాడు. అలాగే న్యాయవాది న్యాయదేవత ముందు తాను స్వపరబేధం, ధన లోభం లేకుండా, ఆఖరి క్షణం వరకూ న్యాయ పరిరక్షణ కోసం పోరాడతానని శపథం చేస్తాడు. ఐతే ఇవి కొందరి విషయంలో హిపోక్రటిక్ శపథాలవుతున్నాయి.  


అటువంటి దైవిక శపథాలు చేసిన వైద్యులు, న్యాయవాదులు తమ వృత్తిధర్మం, వృత్తిపట్ల గల శ్రద్ధాభక్తులు మర్చిపోయి, తాగి ఆపరేషన్ చేయ్యాలనుకోవటం, రోగి జీవితంతో ఆటలాడుకోవడమే. అలానే న్యాయవాది తాగిన మైకంలో కోర్టు ఆవరణలోకి వచ్చి అశ్లీలాలతో ఎదుటి న్యాయవాదిని దూషించి,కోర్టు ఆవరణలోనే మిగతా వాళ్ళని తిట్టడం అనాగరికం, అమానుషం. చదువుకుని నలుగురిలో తల ఎత్తుకుని తిరిగే ఈ ఇద్దరూ పవిత్రమైన  తమ బాధ్యతని మర్చిపోయి, తాగిన మైకంలో వృత్తిని సాగిద్దాం అని అనుకున్నప్పుడు, కఠిన శిక్షలు అనుభవించక తప్పదు. వారిద్దరికీ జరిగిన అవమానం మిగతావారికి ఒక గుణపాఠం కావాలి.-----------మాలతీ చందూర్

సౌజన్యం: స్వాతి పత్రిక.


Saturday, November 12, 2011

వృక్ష ప్రేమికుడు





" చెట్టుకి ప్రాణం పోసి బతికించండి. చెట్టుని బతకనివ్వండి " అన్న నినాదంతో ఇరవై స్కూళ్ళని ప్లాస్టిక్ రహితంగా  చేసి, లక్షా ఇరవై వేల మొక్కలు నాటడానికి కారణం అయ్యాడు ఒక వ్యక్తి. వాటిలో ఎనభై వేల మొక్కలు బతికి చక్కగా ఏపుగా పెరిగి పళ్ళూ, పువ్వులూ ఇచ్చి వాతావరణంలో సమతౌల్యాన్ని తీసుకొచ్చాయి.
ఈ వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, బంగారు పళ్ళెంలో భోజనం చేసే కోట్లాధిపతి కాదు, స్వంత విమానాలు కల పారిశ్రామికవేత్త కాదు. ఒక మామూలు బస్ డ్రైవర్.
వృక్షో  రక్షతి  రక్షితః అన్న నినాదం కార్యాచరణలో పెట్టి, స్కూలు పిల్లల్లో పర్యావరణ రక్షణ పట్ల అవగాహన కలిగించడానికి ఆ బస్ డ్రైవర్ ఇరవై వేల,నాలుగు వందల మంది స్కూలు పిల్లలని చెట్లు పెంచి, కాపాడే కార్యక్రమంలో నిమగ్నమయ్యేటట్ట్లు చేసాడు.
అతనే యోగనాథన్ అతనికి బాల్యం నుంచీ మొక్కలు పెంపకం అంటే శ్రద్ధ,పిచ్చి. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే స్కూలు ఆవరణలో ఎర్రతంగేడు మొక్క నాటి పోషించాడు. ఈనాడు అది ఎర్రని పూలతో " ఫ్లేం ఆఫ్ థి ఫారెస్ట్ " గా చూసేవారిని కట్టి పడేస్తోంది.
తన స్వంత డబ్బుతో చిన్న చిన్న మొక్కలు కొనుక్కుని, స్కూళ్ళకి వెళ్ళి, పిల్లలకి మొక్కల పెంపకం మీద మక్కువ కలగడానికి,స్లైడ్సు వేసి,ఫిల్ములు చూపించి, వాళ్ళని ఉత్సాహ పరిచి,దగ్గర ఉండి,స్వయంగా పిల్లల చేత మొక్కలు నాటించి,సెల్ ఫోన్ ద్వారా వాటికి ఎల ఎప్పుడు నీళ్ళు పొయ్యాలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.మధ్య మధ్య ఎలా ఉన్నాయో పర్యవేక్షిస్తుంటాడు. 
యోగనాథన్ తీసిన ఫిల్మ్ కి, పర్యావరణ పరిరక్షణవారు ప్రథమ బహుమతికి ఎంపిక చేసి ఢిల్లీలో అవార్డు ఇవ్వబోతున్నారు. నలభై రెండేళ్ళ యోగనాథన్ సేవని, పర్యావరణ పరిరక్షణ కోసం అతను పడిన తాపత్రయాన్ని, టి.వి.ఛానల్స్ లో ఐదు రోజుల పాటూ ప్రదర్శించారు. 
ప్రథమ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్ళే ముందు అతని స్నేహితులు రెండు కొత్త చొక్కాలు కుట్టించి ఇవ్వబోతే, కొత్త చొక్కాలు వద్దు వాటికి అయ్యే డబ్బుతో మొక్కలు కొని స్కూళ్ళలో నాటిద్దాము అన్న ఈ వృక్ష ప్రేమికుడి లాంటివారు ఊరూరా ఉంటే సుజలాం, సుఫలాం, సస్యశ్యామలాం అవుతుంది మన దేశం____మాలతీ చందూర్.


సౌజన్యం: స్వాతి పత్రిక. 


ఈ సందర్భంలో అతనికి మనం కూడా శుభాకాంక్షలు తెలియచేద్దాం.రండి మనం కూడా అతని బాటలో పయనిద్దాం.
నరజాతి మనుగడకు ఆధారం చెట్లు..
నాటండీ వేలవేలుగా నేల ఈనినట్లు..అని అందరం మన వంతు కృషి చేద్దాం.

Monday, October 10, 2011

ఈ రోజు సూసైడ్ ప్రివెన్షన్ డే

సంవత్సరానికి ఉన్న 365 రోజులలో మానవ సంబంధాలకి, మానవీయ దృక్పథానికి, దీర్ఘ వ్యాధులకి, సమాజానికి సంకేతంగా ఏడాదిలో 92 రోజులు ప్రత్యేకంగా గుర్తించి, వాటిని ప్రపంచ వ్యాప్తంగా దేశ, జాతి, మత, వివక్షత లేకుండా పాటించాలని, అంతర్జాతీయ ముఖ్య దినాలుగా గుర్తించాలన్నారు.
మదర్స్ డే, ఫాదర్స్ డే, సీనియర్స్ డే, డాక్టర్స్ డే, కేన్సర్ డే దీర్ఘ వ్యాధులు- అనేక దినోత్సవాలతో పాటు సెప్టెంబరు పదో తేదీని ఆత్మహత్యల నివారణ దినం గా ప్రకటించారు ఇటీవలే. దీనితో స్పెషల్ డే లు 93 కి చేరుకున్నాయి.
అసలు ఆత్మహత్యలు ఎందుకు పెరిగిపోతున్నాయి. స్త్రీ పురుషులలో ఎవరు ఎక్కువ సంఖ్యలో - ఏ వర్గం లో వారు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నరు వంటి ప్రశ్నలకి, పట్నాల్లో యువతులు, పల్లెటూళ్ళలో రైతులు, మధ్య తరగతిలో స్త్రీలు ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
 ఈ మూడు వర్గాల్లో వ్యవసాయదారులు, సన్నకారు రైతులు, ఎక్కువమంది ఉన్నారుట. ఇప్పటికి 2 లక్షల 41 వేలమంది బడుగు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతమంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ? - రాజకీయాలు, ప్రభుత్వ శాఖలోని లంచగొండితనం, దళారీలు. ఇవే గాక పొగాకు, పత్తి, వేరు శెనగ వంటి వ్యాపార పంటలు పండిస్తే లాభాలు వస్తాయన్న ఆశ రైతుల్లో కల్పించి, అప్పులిచ్చి వాళ్ళని ముంచుతున్న మధ్యవర్తులు.
ఎరువులు, క్రిమి సంహారక మందులను ప్రభుత్వం సకాలంలో అందించలేకపోతోంది. వాటిని బ్లాకులో ఎక్కువ ధరకి అమ్ముకునే కంపెనీలు-వారి అనుయాయులు, ఇదంతా తమ వెనకే జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపొవడంతో రైతులు అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు నివారించే చర్యలు, పరిస్థితులు కల్పించాలి కాని. " సూసైడ్ ప్రివెన్షన్ డే " అని ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉంటుందా? --- మాలతీ చందూర్.          

Wednesday, September 28, 2011

ప్రజా క్షేమమే ముఖ్యం కావాలి


ఒకప్పుడు మన దేశంలో మద్య నిషేధం అమలులో ఉండేది. మద్య నిషేధం వల్ల ఖజానాకి గండి పడిపోయి ప్రభుత్వం దివాలా తీస్తుంది. సంక్షేమ పథకాలని కొనసాగించడానికి డబ్బు ఉండదు అంటూ చాలా చోట్ల మద్య నిషేధం ఎత్తేసారు.
రాష్ట్ర ప్రభుత్వం వేలం పాటలు పాడి లిక్కర్ షాపులకి అనుమతి ఎచ్చింది. అన్ని ఊళ్ళలో మందు బాబులు, ప్రభుత్వం అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ ఖజానా నిండుగా ఉంది. మందు బాబులు పీకల దాకా తాగి వీధుల్లో భరత నాట్యం, ఇంట్లో కలహ నాట్యం చేస్తున్నారు.
'లిక్కర్ షాపులని కొన్ని నిబంధనలకి కట్టుబడి నడపాలి.లైసెన్సులు ఇచ్చే ముందుకండీషన్లు జారీ చేసాము. నిబంధనలని ఉల్లంఘిస్తే షాపులు మూయించి, లైసెన్సులు రద్దు చేస్తామూ అంటూ శాసన సభల్లో గొంతు చించుకు అరుస్తుంటారు మన రాజకీయవాదులు. కాని వాస్తవానికి తాము విధించిన నిబంధనలని ఎంత వరకు లిక్కర్ షాపులు అమలు చేస్తున్నాయి అన్నది పరిశీలించక ఆ బాధ్యత మధ్యవర్తులకి వదిలేస్తున్నారు. 
స్కూళ్ళు,కాలేజీలు,కుటుంబాలు నివసించే ప్రాంతాలు,  మసీదులు, చర్చిలు, గుళ్ళు  గోపురాలు, భజన మందిరాలు, మఠాలు- వీటి చుట్టు పక్క్ల లిక్కర్ షాపులు ఉండకూడదు. రెండు కిలోమీటర్ల దూరాన ఉండాలి తప్ప సామాన్య ప్రజలకి- స్త్రీలు, పిల్లలకు ఇబ్బంది కలిగేటట్లు ఉంచకూడదు. అర్ధరాత్రి దాక వీటిని తెరిచి ఉంచకూడదు అని కూడా నిబంధన ఉంది.
ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి. ఎవరూ కాదనరు. అందుకని లిక్కర్ షాపులు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నప్పుడు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఈ షాపులు ఎక్కడ, ఎలా నడుపుతున్నారో నిఘా వేసి ఇరవై నాలుగు గంటలూ ప్రభుత్వం, పోలీసులూ ఒక కన్నేసి ఉంచాలి. ఇటువంటి షాపులను మూయించటమే కాదు, ఆ షాపు వాళ్ళ లైసెన్సు రద్దు చేసి కటకటాల వెనక కూర్చోబెట్టాలి.
ప్రభుత్వం డబ్బు దండుకోవడంలో చూపే చొరవ, ప్రజల క్షేమం పట్ల కూడా చూపించాలి. ప్రజా క్షేమమే ముఖ్యం కావాలి. ___  మాలతీ చందూర్.   

Monday, September 19, 2011

వార్ధక్యం లేని మనసు...

జీవితం ఒక నది లాంటిది. నిరంతరం కదిలిపోతూ, అన్వేషిస్తూ, పరిశోధిస్తూ, ముందుకు త్రోసుకునిపోతూ, గట్లు పొర్లి పారుతూ,ఎక్కడ సందున్నా జొరబడుతూ, నీళ్ళతో నింపుతూ ప్రవహిస్తుంటుంది.
కాని చూసారా, మన మనస్సు తానా విధంగా అంటె నది వలె వుండడం నచ్చదు. శాశ్వతము, స్థిరము, కానట్టి ఏ విధమైన భద్రతా లేనట్టి స్థితిలో జీవించడమంటే మనస్సుకు చాలా ప్రమాదకరంగా తోస్తుంది. అందువల్ల తన చుట్టూ తనొక గోడను నిర్మించుకుంటుంది. అదే సంప్రదాయమనే గోడ. వ్యవస్థీకృతమనే గోడ. సాంఘిక, రాజకీయ సిద్ధాతములనే గోడ.  
కుటుంబం, పేరు ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు, అలవరుచుకున్న కొన్ని సద్గుణములు, ఇవన్నీ జీవితానికి దూరంగా, ఆ గోడలలో చేరి ఉంటాయి. కాని జీవితమో- కదిలిపోతూ ఉంటుంది. అది శాశ్వతంగా ఒకే చోట అట్లే నిలిచి ఉండదు. అది ఈ గోడ లోనికి ప్రవేశించి, వాటిని కూలద్రోయదం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది.
ఆ గోడల వెనుక గందరగోళం, కలవరపాటు, దైన్యం రాజ్యం చేస్తూనే ఉంటాయి. అక్కడి దేవతలు దొంగ దేవతలు. వారి శాస్త్ర గ్రంధాలు, వేదాంతం అర్ధం లేనిది.  
జీవితం వీటన్నిటికంటే అతీతం. ఐతే అటువంటి  అడ్డు గోడలు లేని మనస్సుకు, తానార్జించి కూడబెట్టుకున్న విషయాల చేత, తన జ్ణాన వైదుష్యాల భారం చేత కృంగిపోని మనస్సుకు, కాలానికి అతీతంగా ఉంటూ, తనకు భద్రతను కోరుకోకుండా జీవించే మనస్సునకు జీవితమనేది ఒక అద్భుతమైన
విషయంగా  తోస్తుంది. అసలా మనస్సే జీవితం.
మనస్సు తప్ప జీవితానికి వేరే నీడ లేదు. కాని మనసులో చాలా మందికి నీడ కావాలి, విడిది కావాలి. అది ఒక చిన్న ఇల్లో. పేరు ప్రతిష్టలో, పదవులో ఏదయినా కావచ్చు . అందువల్ల మనకివన్నీ ముఖ్యమైనవిగా తోస్తాయి.
మనం స్థిరంగా, శాశ్వతంగా ఉండటం కోరతాం. దానికనుకూలమైన సంస్కృతినే  అభివృద్దిపరుస్తాం. అందుకోసం దేవతల్ని సృష్టిస్తాం. కాని నిజానికి వారు దేవతలు కానే కారు. వారు మన కోరికలకు మారు రూపాలు- అంత మాత్రమే.
పూర్తిగా జీవిత ప్రవాహంతో పాటే కదులుతూ, కాలగమనంతో సంబంధం లేకుండా, ముందు ముందుకు త్రోసుకుపోతూ, అన్వేషణ గావిస్తూ, భగ్గుమని ప్రజ్వరిల్లుతూ, బ్రద్దలవుతూ ఉండే విశ్రాంతి లేని మనస్సు మాత్రమే ఆనందానికి నిలయమౌతుంది.
అటువంటి మనస్సు సృజనాత్మకము కాబట్టి అది నిత్య నూతనం. దానికి వార్ధక్యమనేది రాదు. _ జిడ్డు కృష్ణమూర్తి. 

సంగ్రహణము : స్వాతి  సపరివార పత్రిక.