ఈనాడు వైద్యుడు నేలబారు నుంచి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఆపరేషన్ మొదలుపెట్టేముందు, డాక్టరు ఏ మతానికి చెందినవాడైనా ఆ మత దైవాన్ని ప్రార్థించి మరీ ఆపరేషన్ కత్తి చేపడతాడు.
అంతటి నియమనిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో తమ వృత్తికి అంకితమయ్యే డాక్టర్లు కొందరు ఈనాడు తాగి ఆపరేషన్ థియేటర్ కి వస్తున్నారంటే మనం ఎక్కడికెళుతున్నాము? వైద్యవృత్తి దైవికము కాదు మందువికము అన్న స్థితికి పడిపోతున్నాము.
వైద్యుడు రోగి ప్రాణాలు కాపాడతాడు. న్యాయవాది తనని నమ్మి వచ్చిన క్లయింటు ఆస్తిపాస్తులను న్యాయబద్ధంగా కాపాడతాడు. ఈ రెండు వృత్తులూ ప్రాణాలనూ, ఆస్తులనూ కాపాడే వృత్తులు.వైద్యుడు వృత్తి చేపట్టేముందు రోగి ప్రాణాలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యం,ఆశయం, శాయశక్తులా అందుకు పోరాడతానని శపథం చేస్తాడు. అలాగే న్యాయవాది న్యాయదేవత ముందు తాను స్వపరబేధం, ధన లోభం లేకుండా, ఆఖరి క్షణం వరకూ న్యాయ పరిరక్షణ కోసం పోరాడతానని శపథం చేస్తాడు. ఐతే ఇవి కొందరి విషయంలో హిపోక్రటిక్ శపథాలవుతున్నాయి.
అటువంటి దైవిక శపథాలు చేసిన వైద్యులు, న్యాయవాదులు తమ వృత్తిధర్మం, వృత్తిపట్ల గల శ్రద్ధాభక్తులు మర్చిపోయి, తాగి ఆపరేషన్ చేయ్యాలనుకోవటం, రోగి జీవితంతో ఆటలాడుకోవడమే. అలానే న్యాయవాది తాగిన మైకంలో కోర్టు ఆవరణలోకి వచ్చి అశ్లీలాలతో ఎదుటి న్యాయవాదిని దూషించి,కోర్టు ఆవరణలోనే మిగతా వాళ్ళని తిట్టడం అనాగరికం, అమానుషం. చదువుకుని నలుగురిలో తల ఎత్తుకుని తిరిగే ఈ ఇద్దరూ పవిత్రమైన తమ బాధ్యతని మర్చిపోయి, తాగిన మైకంలో వృత్తిని సాగిద్దాం అని అనుకున్నప్పుడు, కఠిన శిక్షలు అనుభవించక తప్పదు. వారిద్దరికీ జరిగిన అవమానం మిగతావారికి ఒక గుణపాఠం కావాలి.-----------మాలతీ చందూర్
సౌజన్యం: స్వాతి పత్రిక.


